Friday 17 February 2017

మీరు సుప్రీం కోర్టు లో కేసు వేయాలనుకుంటున్నారా!!
అయితే తాజాగా మధ్యతరగతి వారికోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పూర్తి వివరాలు మీ కోసం....
సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే.. అది చాలా ఖర్చుతో కూడుకున్న పనని భావిస్తాం. దీంతో చాలా మంది పేదలు.. మధ్యతరగతి ప్రజలు తమకు అన్యాయం జరిగినా.. సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సాహసించరు. ఖర్చులు తడిసిమోపెడవుతాయని భయపడుతుంటారు. ఇకపై ఆ భయం లేదు. పేదలు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఆ పథకం పేరు మధ్య ఆదాయ వర్గ (ఎంఐజీ) పథకం. నెలకు రూ.60 వేలలోపు, ఏడాదికి రూ.7.50 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు. వీరి కోసం సుప్రీంకోర్టు మధ్య ఆదాయ వర్గ న్యాయ సహాయ సొసైటీని ఏర్పాటు చేసింది. దీనికి భారత ప్రధాన న్యాయమూర్తి ప్యాట్రన ఇన చీఫ్‌గా, అటార్నీ జనరల్‌ ఎక్స్‌ అఫీషియో వైస్‌ ప్రెసిడెంట్‌గా, సొలిసిటర్‌ జనరల్‌ గౌరవ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సభ్యులుగానూ ఉంటారు.
ఫీజులెంత..!
న్యాయం పొందాలనుకునే మధ్యతరగతి ప్రజలు రూ.500 సొసైటీకి, రూ.750 సర్వీస్‌ ఛార్జి కింద చెల్లించాలి. అనంతరం పిటిషన్‌ను సొసైటీలో దాఖలు చేయాలి. వీటిని అడ్వకేట్‌ ఆన రికార్డు (ఏఓఆర్‌)కు పంపిస్తారు. ఈ కేసు విచారణకు అర్హమైనదని ఏఓఆర్‌ భావిస్తే.. దీనిపై కోర్టులో వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవాదికి బాధ్యతలను సొసైటీ అప్పగిస్తుంది. పిటిషన న్యాయ వివాదానికి అర్హమైనది కాదని ఏఓఆర్‌ నిర్ణయిస్తే సర్వీస్‌ ఛార్జి కింద వసూలు చేసిన రూ.750 మినహాయించుకుని మిగతా సొమ్మును వెనక్కు ఇచ్చేస్తారు. సొసైటీ ద్వారా సుప్రీంకోర్టులో దాఖలయ్యే కేసులు సాధారణ కేసుల్లాగే విచారణకు వస్తాయి.
తీర్పు ఎలా వస్తుంది..!
తీర్పు ఎలా వచ్చినా దాంతో సొసైటీకి సంబంధం ఉండదు. కేసు దాఖలు చేయటం, న్యాయవాదిని ఎంపిక చేసుకోవటంలో మాత్రమే సొసైటీ సహకరిస్తుంది. సుప్రీంకోర్టును ఆశ్రయించటం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిన నేపథ్యంలో సాధారణ ఫీజుతోనే తమ వివాదాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి న్యాయం పొందే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలన్నదే సొసైటీ ఉద్దేశం.కేసును చేపట్టిన న్యాయవాది నిర్లక్ష్యం వహిస్తున్నాడని నిరూపణ అయితే సుప్రీంకోర్టు సదరు న్యాయవాదిని పథకం ప్యానెల్‌ నుంచి తొలగిస్తుంది

No comments: